పంజాబ్‌లో ఆధిక్యంలో వేర్పావాద నేత.. అమృత్‌పాల్‌సింగ్‌

ప్రస్తుతం జైల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌, ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా పంజాబ్‌లో ఆధిక్యంలో ఉన్నారు.

పంజాబ్‌లో ఆధిక్యంలో వేర్పావాద నేత.. అమృత్‌పాల్‌సింగ్‌

చండీగఢ్‌: ప్రస్తుతం జైల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌, ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా పంజాబ్‌లో ఆధిక్యంలో ఉన్నారు. అమృత్‌పాల్‌సింగ్‌ ఖదూర్‌ సాహిబ్‌ నుంచి, సరబ్‌జీత్‌ ఫరీద్‌కోట్‌ స్థానం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. తన సమీప ఆప్‌ ప్రత్యర్థి కరమ్‌జీత్‌సింగ్‌ అనమోల్‌పై సరబ్‌జీత్‌ 70వేలకు పైగా ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జైరాపై లక్ష 72 వేల ఓట్ల ఆధిక్యంలో అమృత్‌పాల్‌ కొనసాగుతున్నాడు. వారాల తరబడి తప్పించుకుని తిరిగిన అమృత్‌పాల్‌ను పంజాబ్‌ పోలీసులు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఖదూర్‌ సాహిబ్‌లో 2019లో కాంగ్రెస్‌ నేత జస్బీర్‌ సింగ్‌ గిల్‌ గెలిచారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా మన్జీత్‌ సింగ్‌ మన్నా ఉన్నారు. లాల్జీత్‌ సింగ్‌ భుల్లార్‌ ఆప్‌ నుంచి, శిరోమణి అకాలీదళ్‌ నుంచి విర్సా సింగ్‌ వాల్తోహా బరిలో నిలిచారు. బియాంత్‌ సింగ్‌ కుమారుడైన సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా.. 2015లో అకాలీదశ్‌, బీజేపీ పాలనలో గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసినవారిని శిక్షించాలనే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. 1984 అక్టోబర్‌ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసిన విషయం తెలిసిందే. అందులో బియాంత్‌సింగ్‌, సత్వంత్‌ సింగ్‌ ఉన్నారు.