Himalayas Earthquakes | హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!

హిమాలయాల్లో రానున్న కాలంలో రెండు అతి భారీ భూకంపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. హిమాలయాలు ఇప్పటికీ చురుకుగానే ఉన్నాయని, వాటి కింది భూభాగంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ భారీ భూకంపాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.

Reported by: Jagan Mohan Talluri | సైన్స్​ – టెక్నాలజీ | Apr 01, 2026, 8:17 pm IST
Read Time: 6 mins
Himalayas Earthquakes | హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!

(జగన్మోహన్‌ తాళ్లూరి)

Himalayas Earthquakes | ప్రకృతి విపత్తుల్లో ఒకొనొక భయానకమైనది భూకంపం! ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తూనే ఉంటుంది. అయితే.. ఆ తీవ్రత చాలా వరకూ తెలియదు. కానీ.. కొన్ని భూకంపాలు 6 లేదా 7 పాయింట్లకు పైగా తీవ్రతతో వచ్చినప్పుడు మాత్రం పెను విధ్వసం.. భారీ ప్రాణనష్టం చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే.. శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త అంచనాలు వెలువరించారు.

యావత్‌ హిమాలయ ప్రాంతాన్ని ఇటీవలే అత్యధిక ముప్పు పొంచి ఉన్న జోన్‌–5గా శాస్త్రవేత్తలు ఇటీవలే వర్గీకరించారు. ఇప్పటి వరకూ ఉన్న భూకంప ప్రమాద తీవ్రతకు సంబంధించిన మ్యాప్‌లో సవరణలు చేస్తూ కొత్త మ్యాప్‌ను తీసుకొని వచ్చారు. అయితే.. దేశంలో 60 శాతానికిపైగా ప్రాంతాలు సెస్మిక్‌ హెజర్డ్‌ మ్యాప్‌లో చోటు చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నది. అంటే.. ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదన్నమాట.

గత అక్టోబర్‌లో వచ్చిన ఒక అధ్యయనం హిమాలయాలు భారీ భూకంపాలకు కేంద్రాలుగా ఉన్నాయని వెల్లడించింది. రాబోయే కాలాల్లో హిమాలయ ప్రాంతాల్లో రెండు అతి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదేదో సాదాసీదా అంచనాతో చేసిన హెచ్చరిక కాదు. కేఎం శ్రీజిత్‌, అతని బృందం అత్యాధునిక ప్రమాణాలతో సమాంతర, ఉపరితల స్థాన భ్రంశాలను కొలిచారు. దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అధ్యయనం కొనసాగింది.

ఈ అధ్యయనం నిర్వహించిన ప్రాంతంలో భవిష్యత్తుల్లో రెండు పెను భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.8 పాయింట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని తేల్చారు. ఈ బృందంలో రిషవ్‌ మల్లిక్‌, ఎరిక్‌ జే ఫీల్డింగ్‌, ఎంసీఎం జాసిర్‌, మార్క్‌ సైమన్స్‌, రితేశ్‌ అగర్వాల్‌ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ అధ్యయనానికి ‘జియోడేటిక్‌ ఇన్‌సైట్స్‌ టు హిమాలయన్‌ మెగాథ్రస్ట్‌ కినెమాటిక్స్‌ అన్‌రివీల్‌ ఇన్‌క్రీజ్డ్‌ ఎర్త్‌క్వేక్‌ హెజర్డ్‌’ అని నామకరణం చేశారు. సుమారు 500 నుంచి 700 సంవత్సరాలుగా భూగర్భంలో పోగుపడిన పొరల ఇంటర్‌సెస్మిక్‌ స్ట్రెయిన్‌ను ఈ భూకంపాలు విడుదల చేస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

హిమాలయాల కింద భూమి మెల్లగా ఎగువ భాగానికి ఉబికి వస్తున్నదని అత్యంత కచ్చితత్వంతో కూడి రాడార్‌, శాటిలైట్‌ ఆధారిత పరికరాల ద్వారా పరిశోధకులు కనుగొన్నారు. ‘భూమి నిలువుగా మెల్లగా కదులుతున్నది. ఏడాదికి 5 నుంచి 8 మిల్లీమీటర్ల వరకూ (ఒక శతాబ్దానికి 0.5 మీటర్ల నుంచి 0.8 మీటర్లు) ఈ పెరుగుదల ఉన్నది. ఈ పెరుగుదల మనకు పెద్దగా అనిపించనప్పటికీ.. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నదని, హిమాలయాలు ఇంకా చురుకుగానే ఉన్నాయనేందుకు సాక్ష్యమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ స్వల్ప స్థాయి పెరుగుదలలు, డిఫార్మేషన్లు.. మంచు పర్వతాల కింద బిగ్‌ ఫాల్ట్‌ జోన్‌ వెంబడి పేరుకుపోయిన ఒత్తిడిని తొలగిస్తాయని, దీనినే సాధారణ భాషలో చెప్పాలంటే భారీ భూకంపాలకు దారి తీస్తాయని చెబుతున్నారు.

Read Also |

Skydiver Left Dangling : విమానానికి వేలాడిన స్కై డైవర్ ..ప్రమాద ఘటన వైరల్
Mole | అక్క‌డ పుట్టుమ‌చ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌర‌వం ల‌భిస్తుంద‌ట‌..!
Viral Inspirational Video | కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!