Samsung Galaxy S25 | స్మార్ట్ఫోన్ సాఫ్ట్వేర్ రంగంలో కొరియన్ కంపెనీ శాంసంగ్ కీలక ముందడుగు వేసింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందిస్తున్న OneUI 9 అప్డేట్ను పరీక్షిస్తున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఫోన్లో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ను అంతర్గతంగా పరీక్షిస్తోందని తాజా లీకులు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం శాంసంగ్ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 అప్డేట్ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తదుపరి సాఫ్ట్వేర్ అభివృద్ధిపైనా శాంసంగ్ దృష్టిసారించింది. ప్రముఖ టిప్స్టర్ తరుణ్ వత్స్ సోషల్మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేసిన దాని ప్రకారం.. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ మొబైల్లో తొలి అంతర్గత OneUI 9 టెస్ట్బిల్ట్ను గుర్తించారు. అయితే ఆ బిల్ట్ నంబర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. సాధారణంగా శాంసంగ్ కొత్త వన్యూఐ వెర్షన్ల పరీక్షలను ప్రారంభించే సమయంతో పోలిస్తే ఈసారి రెండు వారాల ముందుగానే టెస్టింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది గెలాక్సీ ఎస్25 సిరీస్ కోసం వన్ యూఐ 8 తొలి టెస్ట్ జూన్ 19 ప్రాంతంలో కనిపించగా.. ఈసారి వన్ యూఐ 9 అభివృద్ధి మరింత వేగంగా సాగుతున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. దీంతో ఆండ్రాయిడ్ 17 ఆధారిత అప్డేట్ను వినియోగదారులు ఊహించిన దానికంటే ముందుగానే పొందే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక OneUI9లో అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ నోట్స్లో డెకరేటివ్ టేప్స్, కొత్త పెన్ లైన్ స్టైల్ జోడించనున్నారు. కాంటాక్ట్స్ యాప్ నుంచి నేరుగా క్రియేటివ్ స్టూడియోను యాక్సెస్ చేసే సౌకర్యం కూడా అందుబాటులో రానుంది. అలాగే క్విక్ ప్యానెల్కు కొత్త డిజైన్, మరింత సులభమైన నియంత్రణలను తీసుకురానున్నారు.
యాక్సెసిబిలిటీ ఫీచర్లపైనా శాంసంగ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మౌస్ కీ వేగాన్ని వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చే అవకాశం కల్పించింది. కొత్త టాక్బ్యాక్ ప్యాకేజ్, Text స్పాట్లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నారు. Text Spotlight ఫీచర్ ద్వారా ఎంపిక చేసిన వచనాన్ని ప్రత్యేకంగా ఫ్లోటింగ్ విండోలో పెద్దగా, స్పష్టంగా చూడవచ్చు.
భద్రతాపరంగా కూడా వన్ యూఐ 9లో కొత్త సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఫీచర్లను శాంసంగ్ చేర్చనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు స్మార్ట్ ఫీచర్లను కూడా అందించనుంది. ఫొటో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, స్మార్ట్ సెర్చ్తో పలు విభాగాల్లో ఏఐ సామర్థ్యాలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
