IND vs NZ 2nd T20I | ఇషాన్​ – సూర్యల విధ్వంసంతో రెండో టి20లోనూ భారత్​ ఘనవిజయం

రాయ్​పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని రికార్డు స్థాయిలో కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి, న్యూజీలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్​ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఈ మ్యాచ్‌ను పూర్తిగా భారత పక్షంగా మార్చేసాయి.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 23, 2026 11:32 PM IST
IND vs NZ 2nd T20I | ఇషాన్​ – సూర్యల విధ్వంసంతో రెండో టి20లోనూ భారత్​ ఘనవిజయం

IND vs NZ 2nd T20I: Ishan Kishan, Suryakumar Yadav Power India to Record Chase in Raipur

సారాంశం:
రాయ్​పూర్‌లో జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మెరుపులతో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో టీమిండియా 2–0 ఆధిక్యం సాధించింది.

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

IND vs NZ 2nd T20I | రాయ్​పూర్​లో జరిగిన రెండో టి20 మ్యాచ్​లో భారత్​ న్యూజీలాండ్​పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన కివీస్​ 20 ఓవర్లలో 208 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో భారత్​ 18 ఓవర్లలోనే గమ్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్​లో విన్నర్​​ పాత్రను ఇషాన్​ కిషన్​ పోషించాడు.

ఇవాళ ఇషాన్​, సూర్యల వంతు : రికార్డుల మోతతో దద్దరిల్లిన రాయ్​పూర్​

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు తొలి ఓవర్​లోనే భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్లిద్దరూ 7 బంతులకే 6 పరుగులు చేసి పెవిలియన్​ చేరడంతో భారత అభిమానులలో ఆందోళన నెలకొంది. కానీ, దాన్ని పటాపంచలు చేస్తూ, 3వ స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన ఇషాన్​ కిషన్​ చిచ్చరపిడుగల్లే రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్​లతో విరుచుకుపడగా, కివీస్​ ఫీల్డర్లు, భారత కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​ ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇషాన్​ 21 బంతుల్లో అర్థశతకం చేయగా, వాటిలో 9 ఫోర్లు, 2 సిక్స్​లు ఉన్నాయి. అంటే 50లో 48 పరుగులు బౌండరీలతోనే సాధించగా, 2 పరుగులు మాత్రమే సింగిల్స్​ ఉన్నాయంటే, విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

Suryakumar Yadav and Shivam Dube celebrating after winning IND vs NZ 2nd T20 match at Raipur

తొలుత ఇషాన్​ దాడిని చూస్తూ ఎంజాయ్​ చేసిన కెప్టెన్​ సూర్యకుమార్​ తర్వాత తనూ స్ఫూర్తి పొంది న్యూజీలాండ్​ బౌలర్లను ఊచకోత కోసాడు. ఇషాన్​ – సూర్య జంట 3 వికెట్​కు 49 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 76 పరుగుల(11 ఫోర్లు, 4 సిక్స్​లు) వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్​ సంధించబోయిన ఇషాన్​ హెన్రీకి క్యాచ్​ ఇచ్చి ఔట్​ కాగా, క్రీజ్​లోకి వచ్చిన దూబే కూడా ధనాధన్ ఇన్నింగ్స్​తో మెరుపులు మెరిపించాడు. చాలాకాలం తర్వాత ఫామ్​లోకి వచ్చిన సూర్యకుమార్​ యాదవ్​ తనదైన శైలిని అందిపుచ్చుకుని వీరవిహారం చేసాడు. 37 బంతుల్లో 4 సిక్స్​లు, 9 ఫోర్లతో 82 పరుగులు చేసిన సూర్య, 18 బంతుల్లో 3 సిక్స్​లు, ఒక ఫోర్​తో 36 పరుగులు చేసిన శివం దూబే నాటౌట్​గా మిగిలి, 15.2 ఓవర్లలోనే భారత్​ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయం భారత్​ అత్యంత వేగవంతమైన లక్ష్యఛేదనగా రికార్డులకెక్కింది.

కివీస్​ బౌలర్లలో హెన్రీ, డఫీ, సోధీ తలా ఒక వికెట్​ సాధించగా, జాక్​ ఫౌక్స్​ ఒక ఇన్నింగ్స్​లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్​గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఫౌక్స్​ 3 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చుకున్నాడు.

కివీస్​ దూకుడు : అందరూ ఆడారు – 2 వందలు చేసారు

అంతకుముందు, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన న్యూజీలాండ్​ ధాటిగా ఆరంభించింది. ఎవరూ అర్థశతకం సాధించకపోయినా, వచ్చిన ప్రతీ బ్యాటర్​ బ్యాట్​ ఝుళిపించడంతో, కివీస్​ భారీ స్కోరు దిశగా పయనించింది. వారి బ్యాటింగ్​ వేగానికి ఒక దశలో 230 పరుగుల వరకు సాధిస్తుందని అంచనా వేసినా, భారత బౌలింగ్ కట్టుదిట్టంగా మారడంతో 208 పరుగులకే పరిమితమయ్యారు. రచిన్​ రవీంద్ర 44 పరుగులు, కెప్టెన్ సాంట్నర్​ 47 పరుగులు చేసారు. మిగతావారందరూ రెండంకెల స్కోరు సాధించి భారత్​ ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ముందుంచారు. భారత బౌలర్లలో కుల్​దీప్​ యాదవ్​ 2 వికెట్లు, హార్థిక్​, హర్షిత్​, వరుణ్​, దూబే తలా ఒక వికెట్​ తీసుకున్నారు.

దీంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో 2 – 0 తో మరో ముందడుగు వేసింది. 3వ టి20 ఆదివారం 25న గువాహతిలో జరుగనుంది. ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్’​గా ఇషాన్​ కిషన్​ ఎంపికయ్యాడు.