విజయానికి కావాల్సింది – భారత్​కు ‌‌4 వికెట్లు, ఇంగ్లండ్​కు 35 పరుగులు

India-England 5th Test | రేపు ఉదయం ఒక వికెట్​ పడితే, ఇక నరాలు తెగడం ఖాయం. ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్‌–ఇంగ్లాండ్‌ ఐదో టెస్ట్‌ నాలుగో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రికార్డు 374 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బలంగా పోరాడుతోంది.

  • By: ADHARVA |    sports |    Published on : Aug 03, 2025 11:55 PM IST
విజయానికి కావాల్సింది – భారత్​కు ‌‌4 వికెట్లు, ఇంగ్లండ్​కు 35 పరుగులు

India-England 5th Test | రేపు ఉదయం ఒక వికెట్​ పడితే, ఇక నరాలు తెగడం ఖాయం. ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్‌–ఇంగ్లాండ్‌ ఐదో టెస్ట్‌ నాలుగో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రికార్డు 374 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బలంగా పోరాడుతోంది. అయితే, టీ విరామం తర్వాత భారత్‌ పుంజుకుని, జో రూట్‌,  జేకబ్‌ బెతెల్‌ను అవుట్‌ చేసి ఒత్తిడి తెచ్చింది. ఆ తరువాత క్రమంగా చీకటి, వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

నాలుగోరోజు వర్షం వల్ల ఆట ఆపేసే సమయానికి ఇంగ్లాండ్‌ 76.2 ఓవర్లలో 339/6 వద్ద నిలిచింది. హ్యారీ బ్రూక్‌(111), జో రూట్​(105)ల అద్భుతమైన ప్రతిఘటనతో  పతనం నుండి తేరుకుంది. ఇరువురు కలిసి 195 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. రూట్​ కూడా 19 పరుగులకే బ్రూక్‌కు సిరాజ్‌ అందించిన జీవనదానాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకుని, భారత్‌పై తీవ్రంగా దాడి చేశాడు. పాత బంతితో భారత్‌ బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా స్పిన్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మధ్యాహ్న సెషన్‌లో బ్రూక్‌ చెలరేగి, ఆకాశ్​ దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌, కవర్స్‌ మీదుగా బౌండరీలు సాధించాడు. అయితే చివరికి ఆకాశ్​దీప్‌ వేసిన బంతినే లాఫ్ట్‌ చేయబోయి, సిరాజ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రూట్‌ మాత్రం సొగసైన షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపాడు.

రోజు ప్రారంభంలో ఇంగ్లాండ్‌ 50/1తో ఆరంభించింది. సిరాజ్‌, ఆకాశ్​దీప్‌ కఠినమైన స్పెల్‌ వేస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తెచ్చారు. ప్రసిద్ధ్‌ కృష్ణ ఉదయం డకెట్‌ను స్లిప్‌లో అవుట్‌ చేస్తే, సిరాజ్‌ కెప్టెన్​ ఓలీ పోప్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అయితే, తర్వాత బ్రూక్‌–రూట్‌ జంట భారత్‌ బౌలర్లను పూర్తిగా కట్టడి చేసింది. ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధిక విజయవంతమైన లక్ష్యచేదన 1902లో ఇంగ్లాండ్‌ చేసిన 263 పరుగులు. ఈసారి 374 పరుగులు సాధిస్తే అది కొత్త రికార్డుగా నిలుస్తుంది. ఇక వర్షం, చీకటి కారణంగా ఆట నిలిచిపోవడంతో ఆఖరి రోజున ఫలితం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

స్కోర్లు సంక్షిప్తంగా :

భారత్​ – ఫస్ట్​ ఇన్నింగ్స్​: 224, సెకండ్​ ఇన్నింగ్స్​: 396

ఇంగ్లండ్​– ఫస్ట్​ ఇన్నింగ్స్​: 247, సెకండ్​ ఇన్నింగ్స్​: 339/6. విజయలక్ష్యం ‌‌– 374