ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. 39 పరుగులకే మూడు అత్యంత కీలక వికెట్లు ( అభిషేక్ – 11 బంతుల్లో 16), ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 21), మార్క్రమ్(2 బంతుల్లో 0) కోల్పోయిన హైదరాబాద్ను తెలుగు కుర్రాడు, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీశ్ తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీశ్ మిడిల్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ నితీశ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 వ ఓవర్ వేసిన పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ను నితీష్ ఊచకోత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. ఇక నితీష్ ఊచకోత మూలంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను హైదరాబాద్ బౌలర్లు బాగా కట్టడి చేసి టపటపా వికెట్లు నేలకూల్చారు.
వారి ధాటికి పవర్ప్లే ముగిసేసరికి పంజాబ్ 27 పరుగుల అత్యల్పస్కోరుకే మూడు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్స్టో డకౌట్ కాగా, ప్రభ్సిమ్రన్ సింగ్ (4), కెప్టెన్ శిఖర్ ధవన్(14) చేసారు. తర్వాత వచ్చిన సామ్ కరన్ కొద్దిసేపు ఎదురుదాడి చేసినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. తర్వాత వచ్చిన సికందర్ రజా, శశాంక్సింగ్ కొద్దిసేపు నిలకడగా ఆడారు. రజా అవుటయిన తర్వాత రెచ్చిపోయిన శశాంక్, అశుతోష్ శర్మ తోడుగా దాదాపుగా గెలిపించినంత పని చేసాడు. ఆఖరి ఓవర్లో పంజాబ్కు 29 పరుగులు అవసరం కాగా 26 పరుగులు చేయగలిగింది.