U19 World Cup 2026: హెనిల్ పటేల్ ఐదు వికెట్లతో భారత్‌కు తొలి విజయం

U19 ప్రపంచకప్ 2026లో భారత్ తన జైత్రయాత్ర ఘనంగా ఆరంభించింది. హెనిల్ పటేల్ 5 వికెట్లు, అభిజ్ఞాన్ కుందు అజేయ 42తో అమెరికాపై భారత్ డీఎల్‌ఎస్ ఆధారంగా 6 వికెట్ల తేడాతో గెలిచింది.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 16, 2026 12:43 AM IST
U19 World Cup 2026: హెనిల్ పటేల్ ఐదు వికెట్లతో భారత్‌కు తొలి విజయం

Henil Patel stars as India crush USA in rain-hit opener

 సారాంశం:

హెనిల్ పటేల్ ఐదు వికెట్లు, అభిగ్యాన్ కుందు అజేయ ఇన్నింగ్స్‌తో  USAపై భారత్ డీఎల్‌ఎస్ ప్రకారం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

U19 World Cup 2026 2026 | అండర్​19 ప్రపంచకప్​లో భారత జట్టు శుభారంభం చేసింది. బులావాయోలో గురువారం వర్షం అంతరాయం కలిగించిన గ్రూప్-బి మ్యాచ్‌లో, భారత్ అమెరికాపై డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు భారత బౌలర్ల దాడిని తట్టుకోలేక 35.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రారంభ ఓవర్లలోనే పేసర్లు దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్ కలిసి ఒత్తిడి పెంచడంతో అమెరికా టాప్ ఆర్డర్ కుదేలైంది. 12వ ఓవర్లో 35/4గా ఉండగా, అక్కడి నుంచి పెద్దగా పుంజుకోలేకపోయింది.

హెనిన్​ పటేల్​ దెబ్బకు కుదేలైన అమెరికా

India U19 bowler Henil Patel celebrates after taking five wickets against USA in the U19 World Cup 2026 match

హెనిల్ పటేల్ ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఖచ్చితమైన లైన్, లెంగ్త్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసిన తర్వాత, మరోసారి బౌలింగ్‌కు వచ్చి ఇంకో వికెట్ తీసి మొత్తం 5/16తో కోటా ముగించాడు. అమెరికా బ్యాటర్లలో నితిష్ సుడినీ (36) మాత్రమే కొంత ప్రతిఘటించాడు.

వర్షం కారణంగా భారత్‌కు లక్ష్యం – 99 పరుగులు (37 ఓవర్లు)గా మారింది. అయితే ఛేదన ప్రారంభంలోనే భారత్​కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఆరు ఓవర్లకే  యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, కెప్టెన్ ఆయుష్ మాత్రే వరుసగా అవుట్ కావడంతో 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన అభిజ్ఞాన్ కుందు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పరిస్థితిని అర్థం చేసుకుంటూ, తప్పులను సరిచేస్తూ ఆచితూచి ఆడిన కుందు విహాన్ మల్హోత్రాతో కలిసి 45 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. విహాన్ అవుట్ అయిన తర్వాత కనిష్క్ చౌహాన్ సహకారం తోడవడంతో భారత్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. అభిజ్ఞాన్ కుందు 42 పరుగులతో అజేయంగా నిలవగా, భారత్ 17.2 ఓవర్లలో 99/4 చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో భారత్ గ్రూప్-Bలో తొలి విజేతగా నిలిచింది.

పేరుకే అమెరికా అయినా, జట్టంతా భారత సంతతి పిల్లలే కావడం విశేషం. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.