Gajwel Hospital | ఆమె బరువు 139 కిలోలు.. అయినప్పటికీ గర్భం దాల్చి పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. పసిబిడ్డ బరువు 3.75 కిలోలు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. గర్భిణి అధిక బరువు ఉండడంతో.. ప్రసవానికి ఇబ్బంది ఏర్పడుతుందని, కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందో అని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కానీ గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆమెకు సర్జరీ నిర్వహించి ప్రసవం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్కు చెందిన పూజ అనే మహిళ గర్భం దాల్చింది. ఆమెకు ఇటీవలే నెలలు నిండాయి. ఇక ఆమె బరువు వచ్చేసి 139 కిలోలు. ఊబకాయం, థైరాయిడ్ వంటి సమస్యలతో ఆమె భారీగా బరువు పెరిగింది.
ఇక ప్రసవానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దు అనే ఉద్దేశంతో మొదట ప్రయివేటు ఆస్పత్రులను సంప్రదించారు. రూ. 2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని, ప్రసవం కూడా క్లిష్టమవుతుందని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ నేతృత్వంలో డాక్టర్ మంజుల, త్రివేణి, సుశీల, సతీశ్, మహిపాల్లతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించగా, పూజ 3.75 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు.
