Chicken Shops | తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతబడ్డాయి. రాష్ట్రంలోని 50 వేల చికెన్ షాపులు మూతబడడంతో కోడికూర లవర్స్ ఆందోళనకు గురవుతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ చేపడుతామని చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్న 10 వేల చికెన్ షాపులతో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న 40 వేల షాపులు మూతబడ్డాయి. ఇక మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.
గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్గా మారిందని వాపోయారు. మార్జిన్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
అసలే వేసవి కాలంలో చికెన్కు ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బంద్ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్ లో చికెన్ ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.
