నీట్ పరీక్ష వివాదంలో సమగ్ర విచారణ చేపట్టాలని.. వెంటనే బాధ్యులను శిక్షించి, కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
విధాత, హైదరాబాద్ : నీట్ పరీక్ష వివాదంలో సమగ్ర విచారణ చేపట్టాలని.. వెంటనే బాధ్యులను శిక్షించి, కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నీట్ యూజీ 2024పరీక్ష నిర్వాహణ గందరగోళంగా మారిందని, దీంతో లక్షలాది విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. బీహార్లో వెలుగుచూసిన పేపర్ లీకేజీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం, ఆది నుంచి నీట్పై కేంద్రం నిర్లక్ష్య ధోరణి చూపడంపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని నీట్ పరీక్ష తీరుపై పరీక్షా పే చర్చా చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. అందులోనూ ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని అన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
K
లక్షలాది మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టంచేశారు. అలాగే ఇందులో ఎన్టీఏ పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు.. అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆరెస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.