Narayanapeta | ఈ నలుగురే నా బిడ్డను బలిగొన్నారు..! జాతీయ రహదారిపై ఓ తండ్రి వినూత్న నిరసన..!!
పుట్టినప్పటి నుంచి మెట్టినింటికి వెళ్లే దాకా.. అల్లారు ముద్దుగా పెంచాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి కట్నకానుకలు భారీగా ఇచ్చి.. గొప్పగా పెళ్లి జరిపించాడు.

Narayanapeta | ఓ తండ్రి( Father )కి తన బిడ్డంటే ఎంతో ప్రేమ. పుట్టినప్పటి నుంచి మెట్టినింటికి వెళ్లే దాకా.. అల్లారు ముద్దుగా పెంచాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి కట్నకానుకలు భారీగా ఇచ్చి.. గొప్పగా పెళ్లి జరిపించాడు. కానీ కట్నం( Dowry ) వేధింపుల కారణంగా ఆ కూతురు( Daughter ) ఆత్మహత్య( Suicide ) చేసుకుంది. బిడ్డ ఆత్మహత్యతతో ఆ తండ్రి కుమిలిపోయాడు. తన బిడ్డ ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, ఇద్దరు ఆడపడుచులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు. తప్పించుకు తిరుగుతున్న ఆ నలుగురి ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. చివరకు ఆ నలుగురి ఫొటోలతో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జాతీయ రహదారి( National Highway )పై వినూత్నంగా నిరసన తెలిపాడు బిడ్డను కోల్పోయిన ఆ తండ్రి.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా( Narayanapeta District ) కృష్ణ మండలం గుదేబల్లూర్ గ్రామానికి చెందిన చెన్నప్పగౌడ తన కూతురు జయలక్ష్మిని కర్ణాటక( Karnataka )లోని సేడం తాలూకా శంకర్పల్లికి చెందిన శంకర్ రెడ్డితో మూడేండ్ల క్రితం వివాహం జరిపించారు. అయితే పెళ్లైనప్పటి నుంచి జయలక్ష్మికి అత్తింటివారు మరింత కట్నం తేవాలని వేధింపులకు గురి చేశారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక బాధితురాలు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో… ఆవేదనకు గురైన ఆ తండ్రి ‘నా కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచులు అదృశ్యమయ్యారు. కనిపిస్తే నాకు సమాచారమివ్వండి’ అని మహబూబ్నగర్ – రాయిచూర్ జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. ఈ వినూత్న నిరసన నెట్టింట వైరల్ అవుతోంది.