హైదరాబాద్, అక్టోబర్ 21 (విధాత): బీఆరెస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. ‘నువ్వు చేసిన ఆరోపణలు తప్పని నేను మా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి వస్తాను. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కూడా తీసుకుంటాను. నువ్వు సెంటిమెంట్గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలవా? ఎక్కడికో అవసరం లేదు.. నీ సెంటిమెంట్ దేవుడైన సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయంలో ఇద్దరం తడి బట్టలతో ప్రమాణం చేద్దామా?’ అని సవాలు విసిరారు.
ఇంతకూ హరీశ్రావు కాంగ్రెస్పై చేసిన ఆరోపణలు ఏమిటనే సందేహం వస్తోంది కదా? ప్రమాణాలు చేసే స్థాయికి వెళ్లిన ఆరోపణలకు ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశమే కారణమైంది. మంత్రి వర్గ సమావేశానికి ముందు వరకు మంత్రులు కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన పొంగులేటి.. సమ్మక్క– సారక్కల గద్దెల అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష సమావేశానికి ములుగు పర్యటనకు వెళ్లగా, సొంత శాఖ మంత్రి అయిన కొండా సురేఖ హాజరుకాలేదు. ఆ తరువాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి కొండా డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ రెండు సంఘటనలతో పాటు కొండా కుటుంబానికి భద్రత తగ్గించడం, దేవాదాయ శాఖకు చెందిన డెవలప్మెంట్ వర్క్స్ను రోడ్లు భవనాల శాఖ కు అప్పగించడం, ఓ ఎస్డీ సుమంత్ ను విధుల నుంచి తొలగించడం పెద్ద చర్చ నీయాంశమైంది. దీంతో కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తారా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యారు. ఆ మరుసటి రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొండా సురేఖ పాల్గొనలేదు… అయితే కొండా సురేఖ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ తరువాత విభేదాలు తాత్కిలికంగానైతే సమసి పోయినట్లు వాతావరణం కనిపిస్తోంది.
అయితే మంత్రి వర్గ సమావేశానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చ చేసినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గం దండు పాళ్యం ముఠా కంటే అధ్వాన్నంగా తయారైందని, గ్రూపులుగా విడిపోయి తన్నుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలు, కబ్జాల కోసం పోటీ పడుతూ పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ అతుకుల బొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకే అనుమానాలున్నాయని చేసిన ఆరోపణలే ఈ వివాదానికి కారణమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హరీశ్రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గం మన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
