Kishan Reddy | భద్రాచలం – మల్కాన్గిరి నూతన రైల్వేలైన్కు ఆమోదం.. ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు
దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది

విధాత, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులలో రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో 173 కి. మీ. ల పొడవున నిర్మించనున్న భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భద్రాచలం పట్టణానికి నూతన రైల్వే లైన్ డిమాండ్ ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా కేంద్ర మంత్ర జి.కిషన్రెడ్డి తెలిపారు. భద్రాచలం (పాండురంగాపురం) – మల్కాన్ గిరి (జునాఘడ్) నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు భద్రాచలం పట్టణాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తుందని, మొదట ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి రైల్వే లైన్ 147.5 కి. మీ. లు మాత్రమేనని, అనంతరం ఈ ప్రాజెక్టును మరో 26.1 కి. మీ. లు పెంచి భద్రాచలం నుంచి పాండురంగాపురం వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. జైపూర్ – మల్కాన్ గిరి మధ్యన చేపట్టిన నూతన రైల్వే లైన్ ఇప్పటికే నిర్మాణంలో ఉండగా, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ సౌత్ సెంట్రల్ రైల్వే (పాండురంగాపురం) – ఈస్ట్ కోస్ట్ రైల్వే (జునాఘడ్) మధ్యన నూతన కారిడార్ అభివృద్ధికి బాటలు వేయనుందన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఇప్పటి వరకూ ఎటువంటి రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు నూతనంగా రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు ఆయా ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించనున్నాయని తెలిపారు.
అంతేకాకుండా ఈ నూతన ప్రాజెక్టు వలన తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాల మధ్యన ప్రజల రాకపోకలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాలు వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో వృద్ధిని సాధించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ఆయా ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని గనులు, అల్యూమినియం, స్టీల్ ఫ్యాక్టరీల నుండి ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలో ఉన్న పోర్టులకు ఉత్పత్తులను తరలించడానికి దూరం కూడా 140 కి. మీ. తగ్గుతుందన్నారు. ఈ నూతన రైల్వే లైన్ ఛత్తీస్ ఘడ్ నుంచి ప్రజలు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను చేరుకోవడానికి దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా దక్షిణ ఒడిషా, సెంట్రల్ ఒడిషా ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ నగరాలకు నేరుగా కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తుందన్నారు. గతంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో రైల్వే లైన్ల పొడవు గణనీయంగా పెరిగింది. 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17.4 కి. మీ. చొప్పున 87 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి రాగా, 2014-24 మధ్యన 3.7 రెట్లు ఎక్కువగా సంవత్సరానికి సగటున 65 కి. మీ. చొప్పున 650 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయని కిషన్రెడ్డి వివరించారు.