వినోద్‌కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు

  • Publish Date - April 24, 2024 / 02:10 PM IST

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌కు మతి భ్రమించిందంటూ సెటైర్లు

విధాత, హైదరాబాద్ : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్‌ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆరెస్‌ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని బండి జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని.. అది ప్రధాని మోదీ సృష్టించిన కేసు అని, కవిత ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బండి ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని.. దోషులు ఎవరో.. నిర్దోషులు ఎవరో కోర్టు తెలుస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ అంటున్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసుకు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అసలు సంబంధమే లేదని కొట్టి పారేశారు. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలవబోతుందన్నారు.

Latest News