కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖదే: బండి సంజయ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

  • Publish Date - May 25, 2024 / 02:32 PM IST

రైస్ మిల్లర్ల ముడుపులపై విచారణ జరిపించాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారే కూల్చుకుంటారు

విధాత : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపు కోరుతూ శనివారం నల్లగొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ బీఆరెస్ పాలన నుంచే అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సీఐ కి అప్పగించేందుకు మధ్య వర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.

కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని.. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం వలే మిగిలిపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనైనా పరిస్థితి మారుతుందనుకంటే అదే పరిస్థితి కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ లోని కొంత మంది నాయకులు అక్రమార్కులు ఉన్నారని వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు లంచాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని ఆరోపించారు. రైసు మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని, ఏ నాయకుడికి ఎంత ముట్టాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు తాము సహకరించామన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అదే తరహాలో కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల అక్రమాలు సంపాదించుకుని ఆ డబ్బులను ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు.

ధాన్యాభాండాగారంగా ఉన్న నల్గొండ ప్రాంతాన్ని కేసీఆర్ అనే మూర్ఖుడు ఎడారిగా మార్చాడని, కృష్ణజలాల విషయంలో 590 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే… కేసీఆర్ 290 టీఎంసీలకే అంగీకరించి లాలూచీ పడ్డారని మండిపడ్డారు. బీఆరెస్‌ ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్తందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన మాకు లేదని ఆ మాట మేము ఎక్కడా అనలేదని బండి సంజయ్ పేర్కోన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ వారు ఎవరికి ఇవ్వరని వారిలో వారే ప్రభుత్వాన్ని కూలదోసుకుంటారని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడిని రోడ్లపై ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి లేదన్నారు. ఆరు గ్యారెంటీల సంగతి ఏంటో ప్రజలు నిలదీస్తారన్నారు. రుణమాఫీ, వరికి బోనస్‌, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి ఏ హామీలు అమలు కాలేదన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గజ్జుల ప్రేమేందర్ రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిపించాలన్నారు.

Latest News