ఆస్థికలు కలిపేందుకు వచ్చి.. అన్నదమ్ముల మృతి

పెద్దనాన్న మరణించగా అస్థికలను ప్రాజెక్టు నీటిలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.

Reported by: Somu | తెలంగాణ‌ | Nov 18, 2023, 5:53 am IST
Read Time: 3 mins
ఆస్థికలు కలిపేందుకు వచ్చి.. అన్నదమ్ముల మృతి
  • ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి
  • పోచారం ప్రాజెక్టులో ఘటన
  • మృతులు కామారెడ్డి జిల్లా ఇనాం తండా వాసులు


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పెద్దనాన్న మరణించగా అస్థికలను ప్రాజెక్టు నీటిలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు. మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దున ఉన్న పోచారం ప్రాజెక్టులో శనివారం ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధి ఇనాం తండాకు చెందిన అన్నదమ్ములు చౌహన్ హరిసింగ్ (45), బాల్ సింగ్ (41) మృతి చెందినవారిలో ఉన్నారు.


పోలీసులు తెలిపిన వివరాలివి. పెద్దనాన్న లభ్య మరణించగా, అస్థికలను ప్రాజెక్టులో కలిపేందుకు హరిసింగ్, బాల్ సింగ్ శనివారం ఉదయం వచ్చారు. ఈక్రమంలో హరిసింగ్ ప్రాజెక్టులో దిగే క్రమంలో నీట మునిగాడు. గమనించిన బాల్ సింగ్ అన్నను కాపాడే క్రమంలో ఇద్దరూ నీట మునిగారు. ఒకరిని కాపాడబోయి మరొకరు ప్రాజెక్టులో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న హవెలి ఘనపూర్ పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.