చేర్చుకోవద్ధంటూ కాంగ్రెస్ కేడర్ నిరసనలు
విధాత : గద్వాల ఎమ్మెల్యే బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్లో చేరికకు సంబంధించి మండలాల వారిగా తన అనుచరులు, పార్టీలోని మద్దతుదారులతో కలిసి బండ్ల సమావేశాలు నిర్వహిస్తు అభిప్రాయ సేకరణలో పనిలో నిమగ్నమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు, నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పార్టీ మారనున్నట్లుగా ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో గద్వాల కాంగ్రెస్ ఇంచార్జి జడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు.
బండ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళన చేపట్టారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితా తిరుపతయ్య అభిమాని ప్రసాద్ ఏకంగా సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుంటే టవర్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్కు నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేపట్టారు.