కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్ చేశారు.
2లక్షల ఉద్యోగాలు..4వేల పింఛన్లు ఎప్పుడిస్తారు
గ్రూప్ 1 పోస్టులు పెంపుపై చర్యలేవి
మాజీ మంత్రి టి.హరీశ్రావు నిలదీత
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1,2 పోస్టులు పెంచాలని కాంగ్రెస్ నాయకులు కోరారని, ఇప్పుడు గ్రూప్ విద్యార్థులు పోస్టులు పెంచాలని కోరితే స్పందించడం లేదన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశమివ్వాలని బీఆరెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలోని నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బీఆరెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి
ప్రజాపాలన పేరుతో తీసుకున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా నాలుగు వేల పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోగానే ఆసరా పింఛన్లు ఆగిపోయాయయని ఏప్రిల్, మే నెలల ఆసరా పించను వేయలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో పింఛన్లను పెంచుతామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతూ మొదటి సంతకం పెట్టారని మరి మీ సంతకం ఎప్పుడు పెడతారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. వికలాంగులకు రూ.6 వేల పింఛన్ వెంటనే ఇవ్వాలన్నారు. చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు బీఆరెస్ హాయంలో పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చామని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే రెండు పింఛన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు. కొత్త పించన్లతో పాటు పాత బకాయిలు కలిపి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెల మొదటి తేదీనే జీతాలు ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, మరి ఆశా వర్కర్లు ఎందుకు వైద్యవిధాన పరిషత్కు వస్తారని ప్రశ్నించారు. ఎన్హెచ్ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామ పంచాయతీయలకు నిధులు విడుదల చేయాలన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని, 60 వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి జీతాలు ఆపలేదన్నారు.
నీట్ పరీక్ష అవతవకలపై కేంద్ర మంత్రులు స్పందించాలి
నీట్ పరీక్ష అవతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కనీసం స్పందించడం లేదన్నారు. ఈ సమస్యపై బండి సంజయ్, కిషన్రెడ్డిలు స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ ఫలితాలను పది రోజుల ముందుకు జరిపి సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు ఫలితాల రోజే విడుదల చేయడంతో పాటు గ్రేస్ మార్కులు కలపడం పట్ల అంతర్యం ఏంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. పేపర్ లీకే కాకపోతే అయా రాష్ట్రాల్లో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
పార్టీ మార్పుపై అసత్య ప్రచారం
తాను పార్టీ మారుతున్నానంటూ వ్యూవ్స్, బ్రేకింగ్స్ కోసం కొన్ని మీడియా హౌస్ లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని కొందరు, కాంగ్రెస్ లోకి వెళ్తున్నానని మరి కొందరు, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాబోతున్నదని మరి కొందరు తమకు తోచినట్లుగా రాస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్ల లీడర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్నారు. తన విషయంలో ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని, నా క్రెడిబిలిటిని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజాలు రాయాలన్నారు.