Harish Rao | అవగాహాన లేమితోనే టిమ్స్ నిర్మాణంపై కోమటిరెడ్డి విమర్శలు: హరీశ్‌రావు

ఎల్బీ నగర్‌ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై విమర్శలు చేయడం ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహాన రాహిత్యాన్ని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు

Harish Rao | అవగాహాన లేమితోనే టిమ్స్ నిర్మాణంపై కోమటిరెడ్డి విమర్శలు: హరీశ్‌రావు

విధాత: ఎల్బీ నగర్‌ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై విమర్శలు చేయడం ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహాన రాహిత్యాన్ని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ట్విటర్ ఎక్స్‌లో ఆయన కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లేని పోని ఆరోపణలు చేస్తోందని, టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరం అని మండిపడ్డారు.

టిమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే.. 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి జైపూర్‌లో 2022 ఏప్రిల్ 5న నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆస్పత్రి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దేశ రాజధానిలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆస్పత్రి కనిపించడం లేదా..? అని నిలదీశారు. నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలన్నారు. అంతేగాని చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని సూచిస్తున్నా” అని హరీశ్ రావు ట్విట్‌లో  పేర్కొన్నారు.