KTR : ‘స్థానిక’ ఓటర్ల జాబితాలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడవచ్చు: కేటీఆర్
కేటీఆర్ హెచ్చరిక: స్థానిక ఎన్నికల ఓటర్ జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం, బీఆర్ఎస్ సానుభూతిపరులను రక్షించాలి.

KTR | విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని.. అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ కేడర్ కు సూచించారు. బీఆర్ఎస్ నాయకులతో గురువారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామస్థాయిలోనే పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి వెంటనే తీసుకుపోవాలన్నారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంచార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఓటర్ జాబితాలో ఏమన్నా అక్రమాలు, అవకతవకలు జరిగితే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీఆర్ఎస్ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు తమ అభ్యంతరాలను చెప్పుకోవడానికి తక్కువ గడువు విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు.
ఈ రోజు నుంచే గ్రామస్థాయిలో ఓటర్ల జాబితా తయారీ ప్రారంభమవుతుందని, ఈనెల 29న జిల్లాస్థాయిలో, 30వ తేదీ నుంచి మండల స్థాయిలో ఎన్నికల సంఘం అధికారులతో రాజకీయ పార్టీల సమావేశాలు జరుగుతాయని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేదా పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశాల అనంతరం అధికారుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాను వెంటనే సేకరించి, దాన్ని గ్రామశాఖ నాయకులకు పంపాలని సూచించారు. ఓట్లు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఓట్లు గల్లంతైనట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆగస్టు 31వ తేదీలోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికంగా అభ్యంతరాలను నమోదు చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను మీడియా సమావేశాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, సెప్టెంబర్ 2న ప్రచురించే తుది జాబితాలో అందరి ఓట్లు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని కేడర్ కు మార్గదర్శకం చేశారు.