PM Modi’s Japan Visit | జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ –బుల్లెట్ రైళ్ల నుండి AI, భద్రతల దాకా..
ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో బుల్లెట్ రైళ్లు, AI, సెమీకండక్టర్లు, రక్షణ, భద్రత వంటి అంశాలపై చర్చ జరగనుంది. కొత్త ఒప్పందాలతో భారత్-జపాన్ సంబంధాలు మరింత బలపడనున్నాయి.

న్యూఢిల్లీ/టోక్యో: PM Modi’s Japan Visit | భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ పర్యటన కావడం విశేషం. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్–జపాన్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించడానికి, కొత్త సహకార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రధాన వేదిక కానుంది.
ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష
భారత్-జపాన్ సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో విశేషంగా బలపడ్డాయి. ఈ సదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేక వ్యూహాత్మక మరియు గ్లోబల్ భాగస్వామ్యంపై సమీక్ష జరపనున్నారు. ఇందులో –
- రక్షణ & భద్రత (సముద్ర భద్రత, ఇండో-పసిఫిక్ వ్యూహం, సైనిక సహకారం)
- ఆర్థిక భాగస్వామ్యం (వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు)
- సాంకేతికత & ఇన్నోవేషన్ (AI, సెమీకండక్టర్లు, టెలికాం)
- ఇరుదేశాల ప్రజాసంబంధాలు (విద్య, సాంస్కృతిక మార్పిడి, పర్యాటకం)
ముఖ్యాంశాలుగా ఉంటాయి.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ –
“ఈ సదస్సు గత ఏడాదిలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, రాబోయే దశాబ్దానికి భారత్-జపాన్ భాగస్వామ్యం మరింత బలపడేలా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.
భూకంపాన్ని తట్టుకునే బుల్లెట్ రైళ్లు:
మోదీ, ఇషిబా కలిసి సెండై నగరానికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించనున్నారు. సెండై నగరం సెమీకండక్టర్ పరిశ్రమలకు ప్రసిద్ధి.
- ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పటికే కొనసాగుతోంది.
- కొత్త ప్రతిపాదన ప్రకారం E10 సిరీస్ బుల్లెట్ రైళ్లు భారత్, జపాన్లలో ఒకేసారి ప్రారంభించనున్నారు.
- ఇవి గంటకు 320 కి.మీ. వేగంతో పరిగెడతాయి.
- భూకంపం వచ్చినా పట్టాలు తప్పకుండా ఉండే సాంకేతికత ఇందులో ఉంటుంది.
- భవిష్యత్తులో డ్రైవర్ లేకుండా నడపడానికి కూడా వీలు కల్పిస్తాయి.
ప్రాజెక్టు ఖర్చులు & నిధుల సమీకరణ
- మొత్తం ఖర్చు: ₹1,08,000 కోట్లు
- జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA): ₹88,000 కోట్లు (81%)
- మిగతా భాగం: భారత రైల్వే మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర & గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
ఇది ఇప్పటివరకు భారత్లో అమలు చేస్తున్న అత్యంత పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్ట్లలో ఒకటి.
ఆర్థిక భద్రతపై కొత్త ఒప్పందం
ఇరుదేశాలు 2008లో కుదిరిన భద్రతాసహకార ఒప్పందాన్ని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. అలాగే కొత్త ఆర్థిక భద్రతా ప్రణాళిక కూడా ప్రారంభం కానుంది.
ఇందులో ప్రధాన అంశాలు:
- సెమీకండక్టర్లు: చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జాయింట్ వెంచర్స్
- క్రిటికల్ మినరల్స్: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కీలక పాత్ర
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): రక్షణ, పరిశ్రమలు, హెల్త్కేర్ రంగాల్లో వినియోగం
- టెలికమ్యూనికేషన్స్: 5G/6G సాంకేతికతల్లో సహకారం
- క్లీన్ ఎనర్జీ: గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక కార్యాచరణ
భారత్, జపాన్ ఆసియా ఖండంలోని రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు, ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో రెండు. ఇరుదేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి.