గ‌జ్వేల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

గ‌జ్వేల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

సిద్దిపేట : గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముచ్చ‌ట‌గా మూడోసారి పోటీ ప‌డుతున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వంటేరు ప్ర‌తాప్ రెడ్డితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం ఆర్‌వో కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్.. ప్ర‌త్యేక వాహ‌నంలో హెలిప్యాడ్ వ‌ద్ద‌కు ప్ర‌యాణిస్తూ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ ప్ర‌జ‌లు నిన‌దించారు.


గ‌జ్వేల్ నుంచి కేసీఆర్ హెలికాప్ట‌ర్‌లో కామారెడ్డికి బ‌య‌ల్దేరారు. అక్క‌డ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల లోపు కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించే బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. తొలిసారిగా కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్ స‌భ‌లో ఏం మాట్లాడుతారు అనే దానిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.


సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ శ‌నివారం ప్రత్యేక పూజలు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేషన్‌ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్‌ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు.


విజయాల పరంపర


కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.