Site icon vidhaatha

CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర

CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్(విధాత): తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు బడికి వచ్చే పిల్లల్నే కాదు తల్లిదండ్రులను ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించింది ఉపాధ్యాయులేనని ఆయన గుర్తుచేశారు.

శుక్రవారం శిల్పారామంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు చాలా మంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలని వారి దగ్గర పెట్టుకుంటారు, కానీ నేను మీ సోదరుడిగా విద్య శాఖనునా దగ్గర పెట్టుకున్నాను, నేనే స్వయంగా విద్య శాఖను పర్యవేక్షిస్తున్నా అన్నారు. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారన్నారన్నారు.

విద్యా శాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని అంటున్నారు. విమర్శకులకు నేను ఒకటే చెబుతున్నా.. విద్యా శాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు. పదేళ్లలో విద్యా శాఖ అస్తవ్యస్తమైందన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి పదేళ్లు గడిచింది, మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలన్నారు.

పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు, 2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామన్నారు. డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదని విమర్శించారు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారన్నారు.

ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారు. ఉస్మానియా, కాకతీయ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారన్నారు. మీ ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశామన్నారు. ఎక్కడైనా కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్య పరిష్కరించకుండా ఉండలేదన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు అవసరం. తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 వేల పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.

ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించామన్నారు.

ప్రతీ ఏటా 130 కోట్లు స్కూల్స్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నామని, చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుందన్నారు. టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని, అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయన్నారు.

గతంలో ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేది. కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 3లక్షలు పెరిగిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని నేను అభినందిస్తున్నానని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదామని ప్రతినబూనుదామని వెల్లడించారు.

విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుదామన్నారు. తెలంగాణకు ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ అవసరమని, పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉండాలన్నారు. అందుకే ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఓకే కమిటీని నియమించామన్నారు. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు, విద్య విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

పాఠశాల విద్యనే కాదు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నానన్నారు. వరల్డ్ బెస్ట్ మోడల్ గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు.

దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న వారికి గుర్తించి ప్రోత్సహించాలన్నారు. చదువుతోనే కాదు, క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందని అవగాహన కల్పించాలన్నారు.

విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పుదారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చామని, విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని సీఎం వెల్లడించారు. ఆ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నా.. మీరు, నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం, ఇందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Exit mobile version