లోతట్టు ప్రాంతాల వారిని శిబిరాలకు తరలించండి: సీఎం రేవంత్
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 15 జిల్లాల్లో అధిక వర్షపాతం కురువగా, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు

- అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి
- అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
- నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి
- వెంటనే పారిశుద్ద్య పనులు చేపట్టాలి
- భారీ వర్షాలపై సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు16(విధాత): తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 15 జిల్లాల్లో అధిక వర్షపాతం కురువగా, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధికారులతో మాట్లాడారు. వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.
చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచండి
నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జీలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని.. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు.
వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టండి
నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. దీంతో నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని.. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం తెలిపారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.