Site icon vidhaatha

CM Revanth Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..త‌క్ష‌ణ సాయం రూ.10 వేలు ..తెలంగాణ‌కు రూ.5438 కోట్ల న‌ష్టం

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల రాష్ట్రంలో రూ. 5438 కోట్ల నష్టం జరిగిందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. భారీ ఎత్తున న‌ష్టం జరిగినందున తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామ‌న్నారు. తాము ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరామ‌న్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశానన్నారు.

సోమ‌వారం సాయంత్రం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో మున్నేరు వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను ప‌రశీలించి, బాధితుల‌తో స్వ‌యంగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయిందని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్ల‌డించారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నామ‌న్నారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామ‌ని తెలిపారు.

త‌క్ష‌ణ‌ సాయం రూ. 10 వేలు
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.
పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తామ‌న్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌న్నారు. ఈ మేర‌కు త‌క్షణ అవసరాల కోసం జిల్లా ల కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశామ‌ని చెప్పారు. వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు వెంట‌నేచర్యలు తీసుకోవాలన్నారు.

మౌన‌ముద్ర‌లో ప్ర‌తిప‌క్ష నేత‌
ఇది కష్ట సమయం…. ఈ స‌మయంలో పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారు కానీ
తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారని రేవంత్ అన్నారు. కేటీఆర్ అమెరికా లో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారన్నారు. జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదని రేవంత్ ప్ర‌శ్నించారు. తాము రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయమ‌ని రేవంత్ అన్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తామ‌న్నారు. వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారన్న రేవంత్ రెడ్డి ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో
రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా? అని అన్నారు.

అప్ర‌మ‌త్తంగా యంత్రాంగం
వరదలపైన గత ప్రభుత్వం ఒక పాలసీ ని కూడా రూపొందించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాము రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశామ‌ని తెలిపారు. వరదసాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చామ‌న్నారు. రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల‌కు సీఎం స్ప‌ష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలని సీఎం ఆదేశించారు.

కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారని సీఎం అన్నారు. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.

రూ.650 కోట్ల‌తో మున్నేరు రిటైనింగ్ వాల్‌
ఖమ్మం పోలేపల్లిలో మున్నేరు వ‌ర‌ద బాదితుల‌ను ప‌రామ‌ర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామ‌ని తెలిపారు. వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని ఆదేశించారు

Exit mobile version