విధాత, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అని మంత్రి దామోదరం రాజనరసింహ పేర్కోన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వర్గీకరణ ఉద్యమ నాయకులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. మంత్రి దామోదరం రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుపై చర్చించారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో వర్గీకరణ మేరకు రిజర్వేషన్లను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై మాదిగ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాజనరసింహా ఈ సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం రాజనరసింహ మాట్లాడుతూ వర్గీకరణ తీర్పుపై తొలుత స్పందించి, వెంటనే అమలు చేస్తామని, ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాల్లోనూ అర్డినెన్స్ తెచ్చైనా అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పై సీనియర్ అడ్వకేట్లతో అధ్యయనం చేయిస్తామన్నారు. కమిటీ వేసి ఆర్డినెన్స్ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాకు ఏ పదవి అక్కరలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై స్పందించి అమలుకు చర్యలు తీసుకుంటాననిన సీఎం రేవంత్రెడ్డిని అభినందిస్తున్నట్లుగా చెప్పారు.