Site icon vidhaatha

CPI Narayana | కర్ణాటక గవర్నర్ ఆదేశం రాజ్యంగ విరుద్ధం: సీపీఐ నారాయణ

CPI Narayana | కర్నాటక ముడా స్కాం (MUDA Scam)లో సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) పై విచారణకు గవర్నర్‌ ఆదేశం రాజ్యాంగ విరుద్ధం అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బీజేపీ తీరు మారలేదన్నారు. ప్రతిపక్ష పాలిత కర్నాటక (Karnataka)లో ముఖ్యమంత్రికి ముడా భూ కుంభ కోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడమే ఆలస్యం ఆ రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి జవాబుదారీ లేని గవర్నర్ పెత్తనమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ,జేడీ(ఎస్‌) వంటి పార్టీలు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) కుంభకోణంలో సిద్ధరామయ్యకు ప్రమేయం ఉందని, ఒక కార్యకర్త ఫిర్యాదు చేస్తే, దానిపై గవర్నరు విచారణకు ఆదేశించడం పెను దుమారం రేపిందన్నారు. ఈ స్కామ్‌లోనే నిందితులుగా ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షం జేడీఎస్‌ నేతల విచారణకు గవర్నర్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదన్నారు. కానీ, ఈ విషయంలో వ్యవహరించిన తీరు ముమ్మాటికీ పక్షపాతంతో కూడిన చర్య సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై వచ్చే నెల 1వ తేదీ నుంచి 9వ తారీఖు వరకు సీపీఐ పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడుతామని నారాయణ తెలిపారు.

Exit mobile version