విధాత, హైదరాబాద్ : తెలంగాణ బొగ్గు గనుల వేలం ప్రక్రియ సందర్భంగా సింగరేణి పట్ల మొసలి కన్నీరు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే సింగరేణిలో జరిగిని అవీనితి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతో పాటు సింగరేణి దుస్ధితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. తాడిచర్లను ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆరేనని, ఆయన మూర్ఖపు ఆలోచన వల్లే సంస్థను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. సింగరేణిని తన కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్నారని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే.. కార్మికుల పట్ల ప్రేమే ఉంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ స్వలాభం కోసం సింగరేణిలో అంతులేని అవినీతి చేస్తే… కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారన్నారు. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్పా. వారికి వేరే ఆలోచన లేదన్నారు. .
సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, బీఆరెస్లు పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమేనని రాష్ట్రానిది 51 శాతం ఉందని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని అన్నారు. సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయం చేసి కేంద్రంపై బురదల చల్లే కుట్ర చేస్తున్నారన్నారు. మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కృషి వల్లే ఇవాళ యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.