ధరణిలో వచ్చిన భూమి సమస్యలు ఏమిటి? రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి సమస్యలు పరిష్కరించాలని పోర్టల్లోని మాడ్యూల్స్లో దరఖాస్తులు
విధాత: ధరణిలో వచ్చిన భూమి సమస్యలు ఏమిటి? రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి సమస్యలు పరిష్కరించాలని పోర్టల్లోని మాడ్యూల్స్లో దరఖాస్తులు వచ్చాయి? నిజంగా రైతులకు, భూ యజమానులకు ఏ సమస్యకు ఏ పోర్టల్లో దరఖాస్తు చేయాలో అవగాహన ఉన్నదా? ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ లేని సమస్యలపై రైతులు వచ్చి పేపర్పై దరఖాస్తు ఇస్తే పరిష్కరిస్తున్నారా? లేదా? అని ధరణి కమిటీ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నది. ఈ మేరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు ధరణి కమిటీ జిల్లా కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సమావేశానికి సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశం నుంచే అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యంగా ధరణి నిర్వహణ ఎలా ఉంది? భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అసైన్డ్ భూముల సమస్యలు, అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యలు, ఆర్ ఎల్ ఆర్, నోషనల్ ఖాతా, వైవాటి కబ్జాలు, భూ విస్తీర్ణం హెచ్చు తగ్గులు, పట్టాదార్ పాస్ పుస్తకంలో పేర్లు, ఇతర అక్షరాల తప్పులు తదితర సమస్యలపై వివరాలను కలెక్టర్లు కమిటీకీ అందించినట్లు సమాచారం.
అయితే ఈ సమావేశంలోనే శుక్ర, శనివారాలల్లో ఏఏ గ్రామాలకు వెళ్లాల్లో షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించి ధరణి మాడ్యూల్ను శాంపిల్గా ఈ కమిటి చెక్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రామాల పర్యటన తరువాత ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ తన కసరత్తు వేగం చేసింది.