విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తాజాగా సాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్ లో చేరడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్, వారి సూచనల మేరకు కాంగ్రెస్ లో చేరారు. దీంతో పార్టీకి సానుకూల పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. గాజర్ల అశోక్ కాంగ్రెస్ లో చేరడం వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అశోక్ పేరును పరకాల అసెంబ్లీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ ఆశిస్తున్నారు. వీరిద్దరికీ కాకుండా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ మావోయిస్టు అశోక్ పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు జిల్లాలో తీవ్ర చర్చ సాగుతోంది. ఆయనకు నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్… రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇటీవల సాగుతున్న ఊహగానాలను నిజం చేస్తోంది.