విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎనిమిది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. చర్చలకు సమయం చాలదన్న భావనతో తాజాగా ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించారు. సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 26 వ తేదీన సెలవు ఉండటంతో 27న బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. తర్వాత 28 తేదీ మరో సెలవు ఉండగా.. 29వ తేదీన 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆరోజే ఉండనుంది. ఇక 30 న మరో 19 పద్దులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. అలాగే 31 తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం జరగునున్నాయి. పొడిగించిన ఆగస్ట్ 1,2 తేదీలలో ప్రభుత్వ అజెండా, బిల్లులపై చర్చ చేపట్టనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు బుధవారం రెండో రోజు అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో మునుముందు సమావేశాలు కూడా ఇదే రీతిన సాగడం ఖాయంగా కనిపిస్తుంది.