హైదరాబాద్ టూ ఇండోర్ ఎకనామిక్ కారిడార్
డిసెంబర్, 2026 నాటికి పనులు పూర్తి
Hyderabad to Indore Economic Corridor | విధాత, హైదరాబాద్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నుంచి ఇండోర్( Hyderabad to Indore Economic Corridor )కు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేస్తోంది. ఈ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ( omkareshwar jyotirlinga) టెంపుల్కు తొందరగా చేరుకోవచ్చు. నాలుగు లేన్ల రోడ్డులో మధ్యప్రదేశ్ రాష్ట్రం బల్వారా ప్రాంతంలో పర్వత ప్రాంతాలు ఉండడంతో మూడు టన్నెళ్లు ప్రతిపాదించారు. బేరుఘాట్, బయగ్రామ్, చోరల్ ఘాట్లో టన్నెల్ నిర్మాణ పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. 1.8 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ మూడు టన్నెల్స్ కోసం రూ.1 వేయి కోట్లు వెచ్చిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. నాలుగు లేన్ల ఇండోర్ హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని ఆయన వివరించారు.
మహారాష్ట్రలోని జల్గాం మీదుగా
మహారాష్ట్రలోని జల్గాం మీదుగా హైదరాబాద్ నుంచి ఇండోర్ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఘాట్ సెక్షన్ కావడంతో ఇండోర్ తేజాజీ నగర్ లో 33.40 మీటర్లు, కర్గోన్ జిల్లా బల్వాడా లో 575 మీటర్లు, చోరల్ ఘాట్ లో 550 మీటర్లు, బయగ్రామ్ లో 480 మీటర్ల పొడవునా టన్నెల్ రోడ్లు నిర్మాణం జరుగుతోంది. టన్నెల్ నిర్మాణం మూలంగా కొండ ప్రాంతంలో ప్రయాణం సాఫీగా జరగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. కొండలను పగులగొట్టేందుకు ఎలక్ట్రానిక్ బ్లాస్టింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గాం మీదుగా నిర్మాణం జరుగుతున్న రోడ్డుతో మూడు రాష్ట్రాలకు ప్రయోజనంగా ఉండనున్నది. ఆస్ట్రేలియా సాంకేతికతతో ఈ టన్నెళ్ల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ రోడ్డు ఇరుకుగా, ప్రయాణాలకు అనువుగా లేకపోవడంతో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు.
గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా
ఇండోర్ నగరం నుంచి హైదరాబాద్ కు 713 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రాజెక్టు కు 2020లో భారత్ మాల పరియోజన ఫేజ్ 1 కింద ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 2022 నుంచి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయాణ సమయం 17 గంటలు కాగా ఇది పూర్తయితే 8 నుంచి 9 గంటల వ్యవధిలో హైదరాబాద్ నుంచి ఇండోర్ చేరుకోవచ్చు. ప్రాజెక్టు ప్రారంభంలో రూ.15వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినప్పటికీ, ధరల పెరుగుదల మూలంగా రూ.18,000 కోట్లతో నాలుగు లేన్ల ఎకనామిక్ కారిడార్ ను పూర్తి చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహరాష్ట్ర సరిహద్దులో బుర్హాన్ పూర్ లో ప్రారంభమై మహరాష్ట్రలోని జల్గాం, అకోలా, వాసిమ్, హింగోలి, నాందేడ్ జిల్లాల మీదుగా తెలంగాణలోని సంగారెడ్డి మీదుగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకునేలా కనెక్టివిటీ ఇచ్చారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ ప్రమాణాలను అనుసరించి భూకంపాలు వస్తే తట్టుకునే విధంగా డిజైన్ చేశారు.
రెండు నగరాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు
ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు పెరగడంతో పాటు కారిడార్ వెంట పెద్ద ఎత్తున వేర్ హౌస్ ల ఏర్పాటుకు వీలు కలుగుతుంది. తెలంగాణలో తయారయ్యే వస్తువులను మధ్యప్రదేశ్ కు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే వస్తువులు తెలంగాణకు నేరుగా పంపించే అవకాశాలు ఉంటాయి.
