విధాత, హైదరాబాద్ :
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశమై మంగళవారం ముఖ్యమైన తీర్మానాలకు ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో (Divisions) అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్కు రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది.
ఈ బడ్జెట్ కేటాయింపులో భాగంగా.. కార్పొరేటర్ (corporator) ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు రూ.కోటి.. జిల్లా ఇన్చార్జ్ మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు మరో కోటి రూపాయలను మంజూరు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా జీహెచ్ఎంసీ (GHMC) సూచనలు జారీ చేసింది.
ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి, ప్రజల అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను పారదర్శకంగా వినియోగిస్తామని ఆమె ప్రకటించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల జీహెచ్ఎంసీ (GHMC) కట్టుబాటును ప్రతిబింబించే కీలక నిర్ణయం ఇది అని ఆమె తెలిపారు. తార్నాక డివిజన్ను ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్ ఎంతో దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే ఈ బడ్జెట్కు శాంక్షన్ ఇవ్వడం వలన ఈ కేటాయింపు సాధ్యమైందని పేర్కొన్నారు. పౌర సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
