నువ్వు ముఖ్యమంత్రివా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా?: రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

ప్రభుత్వ భూముల వేలంపై సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. “నువ్వు ముఖ్యమంత్రివా? రియల్ ఎస్టేట్ ఏజెంటువా?” అంటూ ప్రశ్నించారు.

ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నావని..అసలు నువ్వు ముఖ్యమంత్రవా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటు అని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నం.83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో TGIIC వేలం వేయడానికి సిద్ధం కావడం తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

నాడు భూములు కాపాడాలని కోర్టుకు వెళ్లి.. నేడు వేలం పాటలా?

2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారు? ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా? అని హరీశ్ రావు నిలదీశారు. G.O.Ms.No.4 ద్వారా సర్వే నం.83ను హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోంది? మీ అనుయాయులకు మేలు చేసేందుకేనా? అని ప్రశ్నించారు. ఇదే సర్వే నంబర్‌లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్బీఐ కోర్టుకు ఎక్కింది. కోర్టు అంక్షితలు వేసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. అయినా అదే సర్వే నంబర్‌లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు.

నాడు జాతి సంపద..నేడు అమ్మకం సరుకునా..?

ఈ భూమిపై యాజమాన్య వివాదాలు ఉన్నాయి, హెరిటేజ్ అంశం ఉంది, వక్ఫ్ హక్కుల అంశం ఉంది, అనేక కోర్టు వివాదాలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకు? అని, భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం.. భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోంది? అని హరీశ్ రావు నిలదీశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. “ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము” అన్న హామీ ఏమైంది? అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలకు విలువ లేదా? అని విమర్శించారు. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

సుప్రీం ఆదేశాలకు విరుద్దంగా వేలం..

సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా third-party interests సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని, అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న TGIIC వేలాలను వెంటనే నిలిపివేయాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అలాగే సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం అన్నారు.

భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణం అని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని కోరారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండండి. లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హరీశ్ రావు హెచ్చరించారు.

Latest News