విధాత, హైదరాబాద్ : నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డదని..నేడు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ వెనుకబాటుకు గురవుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని..నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదు అని, నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు అన్నారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం అన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి నకిలీ తల్లి
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు. ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఆయన. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడన్నారు. తెలంగాణ తల్లి అనేది ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవడం దుర్మార్గం అన్నారు. రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి, ఆ తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్ అని మండిపడ్డారు. జై తెలంగాణ అనని, ఉద్యమంలో జైలుకు వెళ్ళని రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదు అన్నారు. ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి
సమైక్యవాదుల బాటలో నడుస్తూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు అని హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి చేసింది శూన్యం అని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. ఎరువుల కొరత తెచ్చాడు, విత్తనాల ధరలు పెంచాడు, కరెంటు కోతలు తెచ్చాడు, రైతుబంధు ఎగ్గొట్టాడు. రైతు బీమా డబ్బులు కూడా కట్టకుండా రైతులను గోస పెడుతున్నాడు అని విమర్శించారు. కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగిస్తానంటాడు. రవీంద్ర భారతి కంటే రామోజీ ఫిలిం సిటీ గొప్పదని మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు అన్నారు. కాళోజీ, దాశరథి, గద్దర్ లను చిన్న చేసి మాట్లాడుతున్నాడని హరీష్ రావు ఆరోపించారు.
నాడు బలిదేవత అన్నాడు..నేడు దేవత అంటున్నాడు
డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్ రెడ్డే అని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సోనియా గాంధీని దేవత అంటూ గుడి కడతామంటున్నాడని హరీష్ రావు విమర్శించారు. నాడు సోనియాగాంధీ తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారని, సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్ కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అనాడు ఉందన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ సార్ చెప్పేవారు అని గుర్తు చేశారు. ప్రాణాపాయ పరిస్థితిలో కేసీఆర్ ను ఆనాడు నిమ్స్ లో దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకి నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని అన్నాడని, అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ తేల్చి చెప్పారు అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కేసీఆర్ పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారని..కచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ భజనతో భారతీయులను అవమానించడమే
అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన డోనాల్డ్ ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం భారతీయులను అవమానించడమేనని హరీష్ రావు మండిపడ్డారు. పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి, మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడుతున్న వ్యక్తికి నీరాజనాలు పట్టడం దేశ ప్రజలను అవమానించడమేనన్నారు.
ఇవి కూడా చదవండి :
Sonia Gandhi : బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్
Madhavaram Krishna Rao : మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
