విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్తో ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లుగా యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్కుమార్ వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్తో ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లుగా యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్కుమార్ వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి రెండు దఫాల్లో జులై- ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని తెలిపారు. దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని, ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుందని పేర్కోన్నారు. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుందని, అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించుకోవచ్చని, తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని జగదీశ్ వెల్లడించారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు (హెచ్ఈఐ) తమ ప్యాకల్టీ, ల్యాబ్, క్లాస్రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.
తప్పనిసరి కాదు
దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదని జగదీశ్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు. యూజీసీ ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్), ఆన్లైన్ మోడల్ కోసం ఒక సంవత్సరంలో రెండుసార్లు అడ్మిషన్కు అనుమతించిన తర్వాత గణనీయంగా ప్రవేశాలు పెరిగాయని గుర్తు చేశారు.