మియాపూర్లో 144సెక్షన్ విధింపు.. ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై చర్యలు
నగరంలోని మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు

మియాపూర్లో 144సెక్షన్ విధింపు
ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై చర్యలు
10మందిపై కేసులు
పదేళ్లలో ఇలా జరిగిందా అంటూ కేటీఆర్ ట్వీట్
విధాత : నగరంలోని మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాజధాని శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్నగర్ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2 వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం 144 సెక్షన్ విధించారు. దేశ విభజన సందర్భంగా ఇక్కడి నుంచి పాకిస్తాన్కు తరలిపోయిన వ్యక్తులకు చెందిన (అవెక్యూ) భూముల కింద ఈ 525 ఎకరాలను పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తాము గతంలో కొనుగోలు చేశామని 32 మంది కోర్టు కెళ్లారు. కింది కోర్టుల నుంచి హైకోర్టు వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ భూమి గజం లక్ష వరకు పలుకుతుండటంతో చాలామంది రాజకీయ నేతలు, ఆక్రమణదారుల కళ్లు వీటిపై పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఇందులో 50 ఎకరాల వరకు ఇప్పటికే అన్యాక్రాంతమైంది. తాజాగా ఈ భూముల్లో కొందరు మహిళలు గుడిసెలు వేసుకోవడంతో వివాదం మరో మలుపు తిరిగింది.
పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని చాలామంది మహిళలను రెచ్చగొట్టారని, స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని, పేదలను రెచ్చగొట్టి పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై సంగీత, సీత సహా పది మందిపై కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరోవైపు బీఆరెస్ పదేళ్ల పాలనలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, ఈ పరిస్థితులు శాంతిభద్రతల అద్వాన్న స్థితిని చాటుతున్నాయని, లా ఆండ్ ఆర్డర్ పనిచేయడం లేదని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.