ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంటనగరాల్లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు
కిక్కిరిసిపోతున్న రైళ్లు..బస్సులు
విధాత: ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంటనగరాల్లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు, జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్ల కోసం ఏపీ ఓటర్లు రద్ధీని సైతం లెక్కచేయకుండా వెలుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతున్నారు. మరి కొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు.
పది రోజుల నుంచే బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్డు బస్ స్టాపుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. అటు రైల్వే స్టేషన్లలో అదే పరిస్థితి కనిపిస్తుంది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు దినం కావడంతో వరుస సెలవుల నేపథ్యంలో ఏపీకి చెందిన జంటనగరాల్లోని ఓటర్లంతా స్వస్థలాలకు వెలుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, శుక్ర శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.