దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపి సెల్ఫీలు దిగే వారిపై నిఘా పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. తీగల వంతెనపై సెల్ఫీలు దిగే వారిని గుర్తించి, రూ. 1000 జరిమానా విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపి సెల్ఫీలు దిగే వారిపై నిఘా పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. తీగల వంతెనపై సెల్ఫీలు దిగే వారిని గుర్తించి, రూ. 1000 జరిమానా విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ప్రతి రోజు సాయంత్రం వేళ.. కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువైపోతోంది. ఈ సమయంలోనే వాహనదారులు కూడా తమ వాహనాలను ఆపి ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. కేబుల్ బ్రిడ్జిపై తిరగాలనుకుంటే.. తమ వాహనాలను ఐటీసీ కోహినూరు వద్ద పార్క్ చేయాలని సూచించారు. అక్కడ్నుంచి కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకోవాలన్నారు. ఇక తీగల వంతెనపై కేవలం ఫుట్పాత్పైనే నడక సాగించాలని ఆదేశించారు. బర్త్ డే పార్టీలు, ఇతర సెలబ్రేషన్స్ను కూడా కేబుల్ బ్రిడ్జిపై నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.