Kaleswaram | మేడిగడ్డ అవసరం లేకుండానే సాగునీరు ఇవ్వొచ్చు!
కాళేశ్వరం నుంచి నీటిని తీసుకోకుండానే 2020-2023 సంవత్సరాల్లో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. నాలుగేళ్లూ ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు నిండిందీ, కాకతీయ కాలువ, వరద కాలువల్లో పారిందీ ఎస్ఆర్ఎస్పీ నీరే. ఇది సత్యం

కాళేశ్వరం నుంచి నీటిని తీసుకోకుండానే 2020-2023 సంవత్సరాల్లో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. నాలుగేళ్లూ ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు నిండిందీ, కాకతీయ కాలువ, వరద కాలువల్లో పారిందీ ఎస్ఆర్ఎస్పీ నీరే. ఇది సత్యం. నాలుగేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసింది మొత్తం 160 టీఎంసీలే. గోదావరిలో పైనుంచి వచ్చిన వరదవల్ల అందులో 40 టీఎంసీలు మళ్లీ నదిలోకే వదలాల్సి వచ్చింది. అందువల్ల కాళేశ్వరం కామధేను అని, అద్భుతమని, అహో ఒహో అని చెప్పినదంతా కేసీఆర్ చేసిన కుంభకోణాలకు కవరింగ్ ఇవ్వడం కోసం చేసిందే. శ్రీరాంసాగర్ (90 టీఎంసీ), ఎల్లంపల్లి (20 టీఎంసీ), మిడ్ మానేరు (25.8 టీఎంసీ), లోయర్ మానేరు (24 టీఎంసీ) నిండితే మొత్తం 159.8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కారణంగా కొత్తగా ఎల్లంపల్లి, మిడ్ మానేరు రిజర్వాయర్ల వల్ల 45.8 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. శ్రీరాంసాగర్లో ఏర్పడిన లోటును ఈ రిజర్వాయర్లలో నింపే నీరు పూడ్చుతుంది. ఈ సంగతి వదిలేసి మాయమాటలు, మోసపూరితమైన ఎత్తులు వేసి వేలకోట్ల అంచనాలు పెంచి కాళేశ్వరం తీసుకువచ్చారు. కాళేశ్వరంలో కూడా కొత్తగా చేరిన మోసం మూడో టీఎంసీకోసం మరో 30 వేల కోట్ల అంచనాలు పెంచడం. రెండు టీఎంసీల నీటినే వాడుకునే పరిస్థితి లేదంటే మూడో టీఎంసీ పేరుతో పంపు హౌజులు, కాలువల కెపాసిటీ పెంచేసి, మోటార్ల సంఖ్య పెంచేసి కాంట్రాక్టర్లతో కలిసి పండుగ చేసుకున్నారు కేసీఆర్.
ఇప్పుడు జరగాల్సింది ఏమంటే కాళేశ్వరం (మేడిగడ్డ) అవసరం లేకుండానే ఉత్తర తెలంగాణకు నీరివ్వడం. ఎల్లంపల్లి నిండవచ్చింది. అక్కడి నుంచి వెంటనే లిఫ్టింగ్ మొదలు పెట్టి మిడ్ మానేరుకు, ఆ తర్వాత లోయర్ మానేరుకు తరలించాలి. మూడవ ఆప్షన్గానే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్కు పంపాలి. ఎందుకంటే అక్కడ ఇంకా కాలువల నిర్మాణమే జరుగలేదు. కేసీఆర్ పొలానికి తప్ప రైతుల పొలాలకు నీరుపోయే వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇక పోతే దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఉపయోగించి వరంగల్, సూర్యాపేట ప్రాంతాలకు సాగునీరు ఇవ్వొచ్చు. దేవాదుల కింద చూపించిన ఆయకట్టు సుమారు ఆరు లక్షల ఎకరాలను కూడా కాళేశ్వరం ఖాతాలో చూపించుకుని తెలంగాణ ప్రజల కళ్లు గప్పిన మాయల మరాఠీ కేసీఆర్. దేవాదుల నీరు కాకతీయ కాలువను దాటుకునే జనగామదాకా వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు అందనప్పుడు కాకతీయ కాలువకు దేవాదులను లింకు చేసి సాగునీరు సప్లిమెంటు చేయవచ్చు.
– ఎన్ఎస్ అర్జున్ పటేల్