Journalist Yogi Reddy | యోగిరెడ్డికి జర్నలిస్టుల కన్నీటి నివాళి.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు
కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. యోగి రెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండ తన కార్యాలయంలో కూతురుతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలకు శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యోగి రెడ్డి, ఆయన కూతురు ఆధ్య (10) మృత దేహాలను హనుమకొండలోని ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం నుండి ప్రెస్ క్లబ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి జర్నలిస్టు యోగి రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగి రెడ్డి, ఆద్య మృతదేహాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా అంత్యక్రియల కోసం జనగామకు తరలించారు. జర్నలిస్టులతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.