• Telugu News
  • /Telangana

Inavolu Mallikarjuna Swamy Jatara : ఐనవోలు జాతరలో పటిష్ట ఏర్పాట్లు

జనవరి 13 నుంచి ప్రారంభంకానున్న ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. భక్తులకు తాగునీరు, రవాణా, భద్రతలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Dec 20, 2025, 5:22 pm IST
Read Time: 5 mins
Inavolu Mallikarjuna Swamy Jatara : ఐనవోలు జాతరలో పటిష్ట ఏర్పాట్లు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జాతరపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లతో కలసి జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, కుడా, మున్సిపల్, మిషన్ భగీరథ, ఇతర అధికారులు పాల్లొన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో వైద్య సదుపాయం, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, భద్రతతో పాటు జాతరలో అవసరమైన ఏర్పాట్ల పై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మాట్లాడుతూ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. బస్టాండ్ ఏర్పాటు చేసే చోట పందిళ్ళు వేసి, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో పారిశుధ్య నిర్వహణకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం లేకుండా, ఏ చిన్న సమస్య లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. చిన్నపిల్లల కొరకు బాలామృతం పౌష్టికాహారాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

వైద్య సదుపాయం, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అందులో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.ఆర్టీసీ బస్సులు తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జాతరలో అనుమానితులు, దొంగతనాలు జరగకుండా పోలీసుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళ భద్రత నిమిత్తం మహిళా పోలీసు సిబ్బందిని పోలీస్ శాఖ కేటాయించాలన్నారు. జాతర సమీపిస్తున్న దృష్ట్యా రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఇబ్బంది లేకుండా సైడ్ బర్మ్ లతో నింపాలన్నారు. బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జాతర విశిష్టతను తెలియజేస్తూ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్, డీసీపీ అంకిత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కార్యనిర్వాహణాధికారి సుధాకర్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Pawan Kalyan : కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
Shraddha Srinath | కుర్రాళ్ల గుండెల్ని అదుపుత‌ప్పేలా చేస్తున్న శ్ర‌ద్ధా ఫొటోస్