Jubilee Hills bypoll| జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటేసిన ప్రముఖులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ చురుగ్గా కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఒక్కొక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ యూసఫ్ గూడ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడా నవోదయ కాలనీలో, బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Nov 11, 2025, 11:55 am IST
Read Time: 4 mins
Jubilee Hills bypoll| జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటేసిన ప్రముఖులు

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌(Jubilee Hills bypoll)  చురుగ్గా కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఒక్కొక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్(Naveen Kumar Yadav) యూసఫ్ గూడ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)ఎల్లారెడ్డిగూడా నవోదయ కాలనీలో, బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి(Lenkala Deepak Reddy)లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) షేక్‌పేట డివిజన్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. నటుడు తనికెళ్ల భరణి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా మధురానగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.   పోలింగ్ ప్రక్రియలో 11చోట్ల ఈవీఎంలు మొరాయించగా..రిజర్వ్ ఈవీఎంలతో ఓటింగ్ కొనసాగిస్తున్నారు. తొలిసారిగా డ్రోన్ కెమెరాలతో పోలింగ్ ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ మందకొడిగా సాగుతుంది.

కాంగ్రెస్ నాన్ లోకల్ ప్రజాప్రతినిధులకు చర్యలకు ఈసీ ఆదేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పలు పోలింగ్ కేంద్రాల కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు రేగాయి. మీరంటే మీరే డబ్బులు పంచుతున్నారంటూ పరస్పరం వాగ్వివాదం, తోపులాటకు దిగగా..పోలీసులు వారిని చెదరగొట్టారు. బోరబండలో కాంగ్రెస్ నేతన ఫసీయుద్దిన్ ఓటర్లను బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు. నియోజకవర్గం నాన్ లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య యాదవ్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లడటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన ఈసీ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్ సైతం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించడంపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.