సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని, స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి
ఆగస్టు 31లోగా గంజాయి రహిత ధూల్ పేట టార్గెట్
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని, స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మాదకద్రవ్యాల నిరోధానికి నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్నలలో పెద్దఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ధూల్ పేటలో గతంలో నాటుసారా తయారీని నియంత్రించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం గంజాయి హబ్ గా మారిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ధూల్పేట్లోనే ఉంటున్నాయన్నారు. కొద్దిరోజులుగా దూల్ పేట ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. సోదాల్లో భాగంగా కొద్ది మొత్తాల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆగస్టు 31లోపు ధూల్ పేట గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇక్కడ మాత్రమే కాకుండా సమాంతరంగా మిగతా ప్రాంతాల్లో దృష్టి పెడుతున్నామన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా 1000 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చామని, పట్టుబడ్డ నిందితులకు శిక్షలు పడేవిధంగా కేసుల విచారణ చేస్తున్నామన్నారు. ఇక్కడ జరిపిన సోదాల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని కమలాహాసన్ రెడ్డి తెలిపారు. నిందితులు నగరంలోని శివారు ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేస్తున్నారని.. ధూల్ పేటకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో మూడు కేసుల్లో 66 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. ఆపరేషన్ మొదలుపెట్టాక దూల్ పేటలో 12 కేసులు పెట్టినట్లు చెప్పారు.