మాంసాహారం.. ఆ పేరు వినగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. మాంసాహార వంటకాలను ఎప్పుడెప్పుడు ఆరగించాలా..? అని ఆత్రుత పడుతుంటారు. అయితే ఓ పెద్ద మనిషి ఆత్రుతగా మటన్ ఆరగించాడు. ఇంకేముంది ఓ బొక్కను కూడా మింగేశాడు. ఆ బొక్క అన్నవాహిక ద్వారా వెళ్లి గుండెకు దగ్గర్లో ఆగిపోయింది.
హైదరాబాద్ : మాంసాహారం.. ఆ పేరు వినగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. మాంసాహార వంటకాలను ఎప్పుడెప్పుడు ఆరగించాలా..? అని ఆత్రుత పడుతుంటారు. అయితే ఓ పెద్ద మనిషి ఆత్రుతగా మటన్ ఆరగించాడు. ఇంకేముంది ఓ బొక్కను కూడా మింగేశాడు. ఆ బొక్క అన్నవాహిక ద్వారా వెళ్లి గుండెకు దగ్గర్లో ఆగిపోయింది. దీంతో నెల రోజుల పాటు ఆ వృద్ధుడు నరకయాతన అనుభవించాడు.
వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని కక్కిరేణి గ్రామానికి చెందిన శ్రీరాములు(66) నెల రోజుల క్రితం మటన్ తిన్నాడు. అయితే మటన్ బొక్కను కూడా మింగేశాడు. ఆ బొక్క అన్నవాహికలో గుండెకు అంచున ఆగిపోయింది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. స్థానికంగా ఉన్న డాక్టర్లను సంప్రదిస్తే.. గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి అందుకు మెడిసిన్స్ రాసిచ్చారు.
రోజురోజుకు ఛాతిలో నొప్పి తీవ్రమవడంతో చేసేదేమీ లేక ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు శ్రీరాములు. ఎండోస్కోపి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండెకు దగ్గర్లో మటన్ బొక్కను గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స నిర్వహించి మటన్ బొక్కను విజయవంతంగా తొలగించారు. ఆ మటన్ బొక్క 3.5 సెంటిమీటర్ల పొడవు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీరాములుకు దంతాలు లేకపోవడంతో.. మాంసంతో పాటు బొక్కను కూడా మింగినట్లు తేలింది. ప్రస్తుతం శ్రీరాములు ఆరోగ్యంగా ఉన్నాడని, కేవలం ద్రవ పదార్థాలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.