అక్రమ కేసులతో భయపెట్టలేరు: కంది శ్రీనివాసరెడ్డి

- ఎమ్మెల్యే జోగు రామన్న ఆగడాలను అడ్డుకుంటాం
- ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలనుకుంటోందని, అది సాధ్యం కాదని కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహిపాల్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం జిల్లా జైలులో ఉన్న మహిపాల్ను కలవడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమకు రోజురోజుకూ జనాదరణ పెరుగుతున్న క్రమంలో జోగు రామన్నకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్పతీసేందుకే అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా కల్పించారు.
బీఆర్ఎస్ కి కొంతమంది పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారందరిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఎస్టీసెల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షెడ్మకి ఆనంద్ రావు, నాయకులు ఐనేని సంతోష్ రావు, సుజాత్ అలీ, ఎంఏ షకీల్, కొండూరి రవి, రాజా లింగన్న, చాంద్ పాషా, జంగిలి ప్రవీణ్, గంగారాం, అంజద్ ఖాన్, అస్బాత్ ఖాన్, కర్మ, ఎంఏ అఖీమ్, మహమూద్ ఉన్నారు.