విధాత , హైదరాబాద్ : నిరుద్యోగులపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చూపించిందంతా కపట ప్రేమేనని, అధికారంలోకి వచ్చాకా వారిని గుండెల మీద తన్నుతుందని మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ దవాఖానలో ఆమరణదీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను ఆదివారం మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. ఇది మోతీలాల్ ఒక్కడి సమస్య కాదని, నిరుద్యోగులందరి సమస్య అని, బీఆరెస్ పక్షాన దీక్ష విరమించాలని మోతీలాల్ను కోరామని చెప్పారు. ఎన్నికల్లో నిరుద్యోగులను ఆకర్షించేందుకు రాహుల్ గాంధీని అశోక్నగర్కు పిలిపించి మరీ హామీ నిరుద్యోగులకు హామీలిచ్చారని, రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్ మాట ఇచ్చారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్లో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. గ్రూప్-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ఎందుకు వేయడం లేదని, ప్రైమరీ స్కూల్స్లో టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు. అసెంబ్లీని స్తంభింపచేస్తామని చెప్పారు. మోతీలాల్కు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మోతీలాల్తో చర్చలు జరపాలన్నారు.