KTR | రాష్ట్ర చిహ్నం.. రాష్ట్ర గేయంపై సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి

రాష్ట్ర చిహ్నం..రాష్ట్ర గేయంపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి పాటిసున్నారని, ఇదేక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు

KTR | రాష్ట్ర చిహ్నం.. రాష్ట్ర గేయంపై సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి

తెలంగాణ చరిత్రను చెరిపేస్తున్నారు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు

విధాత, హైదరాబాద్: రాష్ట్ర చిహ్నం..రాష్ట్ర గేయంపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి పాటిసున్నారని, ఇదేక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపమని, చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని..అవి రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని పేర్కోన్నారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలన్నారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప..గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్” అని అధికారిక గీతంలో కీర్తించి..!! అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అంటూ నిలదీశారు.

చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదని, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు ఐకాన్ వంటిదన్నారు. కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదని, సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనన్నారు. మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయని, మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండని ప్రశ్నించారు. భారత జాతీయ చిహ్నంలోనూ..అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయని, జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉందన్నారు. వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండని నిలదీశారు.

కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ? ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా అని, ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారని, రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా అని ప్రశ్నించారు. గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై..యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉందని, సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉందన్నారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదన్నారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.