KTR : స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంలో కోర్టు ధిక్కార పిటిషన్

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువులోగా (అక్టోబర్ 31) నిర్ణయం తీసుకోనందున ఈ పిటిషన్ వేశారు.

KTR Vs Gaddam Prasad

న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది.
బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువులోగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సీజేఐ బీఆర్. గవాయ్ వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లుగా తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బీఆర్‌ఎస్‌ తన పిటిషన్‌లో కేటీఆర్ గుర్తు చేశారు. అక్టోబర్ 31వ తేదీ లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించిందని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో ఇంకా ఫిరాయింపు నేతలు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారని..అందుకే మరోసారి అత్యున్నత స్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రొసీడింగ్స్‌ ఆలస్యం చేస్తే.. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని పిటిషన్ కేటీఆర్ నివేదించారు. ఇంకా ప్రొసీడింగ్స్‌ ఎవిడెన్స్‌ స్టేజిలోనే ఉన్నాయని బీఆర్ఎస్‌ పార్టీ తరఫు న్యాయవాదులు తెలిపారని.. చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి రిటైర్‌ అయ్యేంతవరకు ఈ ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనలు విన్న సీజేఐ గవాయ్.. నవంబర్‌ 24తో సుప్రీంకోర్టు ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం ఈ కేసు విచారణ జరుపుతామని తెలిపారు.