KTR | బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు.. కాంగ్రెస్ మార్క్‌ మార్పు అంటే ఇదేనా?

“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారని, మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైటర్లు వేశారు.

KTR | బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు.. కాంగ్రెస్ మార్క్‌ మార్పు అంటే ఇదేనా?

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై కేటీఆర్ మండిపాటు

విధాత, హైదరాబాద్ : “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారని, మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైటర్లు వేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..పురుగుల అన్నం.. నీళ్ల చారు.. అయితే ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు అని ఇదేనా కాంగ్రెస్ మార్పు అని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైందని, నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి..20 మంది విద్యార్థులకు వాంతులయ్యాయని పేర్కోన్నారు.

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలయ్యారని, ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని, అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ అని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల…పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని, అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే..విద్యార్థులకు ఈ అవస్థ…! ఈ అస్వస్థత…!! అని కేటీఆర్ ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని, లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని, ప్రభుత్వ పాలనా వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదమని ఆందోళన వ్యక్తం చేశారు.